న్యూదిల్లీ : మైనార్టీలు, వలస కార్మికులు లక్ష్యంగా జమ్మూకశ్మీర్లో జరుగుతోన్న హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు 11 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ చేపట్టనున్నట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. ఈ ఘటనల వెనుక ఉన్న కుట్రను వెలికితీయాలని ఎన్ఐఏని కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఆదేశించింది. దీంతో స్థానిక పోలీసులు విచారిస్తోన్న కేసులు ఎన్ఐఏ పరిధిలోకి రానున్నాయి. ఉపాధి కోసం వచ్చిన వారిపై ఉగ్రవాదులు గురిపెడుతున్నారు. ఆదివారం మరో ఇద్దరు వలస కార్మికుల ప్రాణాలు బలిగొన్నారు. ఈ నెలలో అమాయకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య 11కు చేరింది. కుల్గాంలోని వానిపోప్ా వద్ద కూలీలపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు స్థానికేతరులు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు కశ్మీర్ లోయలోని శ్రీనగర్లో పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగించే అరబింద్ కుమార్ షా (బీహార్), పుల్వామాలో సిరాజ్ అహ్మద్ అనే కార్పెంటర్ (ఉత్తరప్రదేశ్)ను కాల్చి చంపారు. ఇప్పటివరకు మరణించిన వారిలో ఐదుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు.