Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఐదుగురు రాజ్యసభ సభ్యుల ప్రమాణం


న్యూదిల్లీ : రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ నాయకుడు రజనీ అశోకరావ్‌ పాటిల్‌, మరో నలుగురు ఎంపీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున కొత్తగా ఎన్నికైన సభ్యులను ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు కోరారు. తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన 63 ఏళ్ల పాటిల్‌ మరాఠీలో ప్రమాణం చేశారు. కోవిడ్‌ అనంతర సమస్యల కారణంగా ఈ ఏడాది మేలో ఆమె సోదరుడు, సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ సతావ్‌ మరణించడంతో ఖాళీ అయిన స్థానానికి మహారాష్ట్ర నుంచి ఎగువ సభకు ఎన్నికయ్యారు. పాటిల్‌ను రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా బీజేపీ తన అభ్యర్థి సంజయ్‌ ఉపాధ్యాయ్‌ను పోటీనుంచి ఉపసంహరించుకుంది.
తమిళనాడు నుంచి కొత్తగా ఎన్నికైన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యులు – కనిమొజి ఎన్‌విఎన్‌ సోము, కెఆర్‌ఎన్‌ రాజేష్‌ కుమార్‌, ఎంఎం అబ్దుల్లా కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. కనిమొజి ఎన్‌వీఎన్‌ సోము మాజీ కేంద్ర మంత్రి ఎన్‌వీఎన్‌ సోము కుమార్తె, ప్రముఖ ప్రసూతి వైద్యురాలు, గైనకాలజిస్ట్‌, లాపరోస్కోపిక్‌ సర్జన్‌, రాజేష్‌ కుమార్‌ డీఎంకే యువజన విభాగంలో పనిచేస్తున్నారు. ముగ్గురు కొత్త ఎంపీల రాకతో రాజ్యసభలో డీఎంకే సభ్యుల సంఖ్య 10కి చేరింది. ఇక పశ్చిమ బెంగాల్‌ నుంచి ఎగువ సభకు ఎన్నికైన తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి లూయిజిన్హో ఫలేరో కూడా ప్రమాణం చేశారు. అంతకుముందు సభ సమావేశం కాగానే నాయుడు రాజ్యసభ కొత్త సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీని సభకు పరిచయం చేశారు. మోదీ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీడీటీ) మాజీ చైర్మన్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img