దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోఓ నర్సు కొవిడ్ టీకా బదులు పొరపాటున రాబీస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కల్వా హెల్త్ కేర్ సెంటర్లో వెలుగుచూసింది.చివరకు అధికారులు జోక్యం చేసుకుని నర్సుతోపాటు డాక్టర్పై కూడా వేటు వేశారు. కొవిడ్ టీకా వేయించుకునేందుకు రాజ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అనూర్చ్ ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. ఆయనకు నర్సు కీర్తి పోపెరె పొరపాటున రాబీస్ వ్యాక్సిన్ ఇంజక్షన్ చేశారు. టీకా వేసే ముందు అతని వద్ద ఉన్న పేపరు చూడకుండా కరోనా టీకాకు బదులుగా.. రాబీస్ వ్యాక్సిన్ ఇవ్వడంపై మున్సిపల్ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. యాదవ్ను ఆరోగ్య కేంద్రంలో వైద్యుల పరిశీలనలో ఉంచారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారని.. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.