ఇప్పటికిప్పుడు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహిస్తే ఆప్ దే విజయమని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ అన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన ఒక రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడిస్తోందని ఆయన తెలిపారు. తక్కువ మార్జిన్ తోనే అయినప్పటికీ గుజరాత్ లో ఆప్ ప్రభుత్వం వస్తుందని ఐబీ రిపోర్ట్ చెపుతోందని అన్నారు. గుజరాత్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయని, ఈ పార్టీల నేతలు రహస్యంగా సమావేశమవుతున్నారని ఐబీ రిపోర్ట్ లో ఉందని కేజ్రీవాల్ తెలిపారు. గుజరాత్ లో బీజేపీ పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని… బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని బీజేపీ బలోపేతం చేస్తోందని చెప్పారు. ఆప్ కు పడే ఓట్లలో వీలైనంత వరకు చీల్చే బాధ్యతను కాంగ్రెస్ కు అప్పగించారని అన్నారు. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని గుజరాత్ ప్రజలను కోరుతున్నానని చెప్పారు.