Friday, April 26, 2024
Friday, April 26, 2024

దిల్లీ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

80 దుకాణాలు దగ్ధం
న్యూదిల్లీ : దిల్లీకి చెందిన చాందినీ చౌక్‌ ప్రాంతంలోని లజపత్‌ రాయ్‌ మార్కెట్‌లో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన తర్వాత కనీసం 80 దుకాణాలు దగ్ధమయ్యాయని అగ్నిమాపక విభాగం అధికారి తెలిపారు. దాదాపు తెల్లవారుజామున 4.35 గంటల సమయంలో లజపత్‌ రాయ్‌ మార్కెట్‌ నుంచి అగ్ని ప్రమాదం జరిగిందని తమకు ఫోన్‌ వచ్చిందని వివరించారు. తొలుత ప్రమాద స్థలికి 10 అగ్నిమాపక శకటాలు చేరుకున్నాయి. తర్వాత మరో ఆరు వచ్చాయి. ఘటనా స్థలికి చేరుకునేందుకు ఇరుకైన దారులు కారణంగా అగ్నిమాపక దళ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బందికి సహాయపడేందుకు పోలీసు ఉన్నతాధికారి బృందం కూడా ఆ ప్రాంతానికి చేరుకుంది. అలాగే సహాయక చర్యల కోసం యాక్సిడెంట్‌, ట్రామా సర్వీసు అంబులెన్స్‌లు కూడా వచ్చాయి. ‘అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఉదయం 8 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి’ అని అగ్నిమాపక అధికారి చెప్పారు. అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణం కావచ్చని, నష్టం వివరాలను ఇంకా నిర్ధారించాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రమాద నష్టం కోట్ల రూపాయల్లో ఉంటుందని, దుకాణదారులందరి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నామని దిల్లీ పోలీసులు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img