దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలు, వరదలతో నదులకు భారీగా వరద నీరు చేరుతోంది. పలు నదులు డేంజర్ లెవెల్ స్థాయికి చేరడంతో డ్యామ్ల వద్ద ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. వరదల వల్ల డ్యాం నీటిని విడుదల చేయడంతో మహారాష్ట్రలోని వసాయి, పాల్ఘార్, దహాను, వడ, విక్రంఘడ్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వైతర్నా, పింజాల్ నదులు పొంగి ప్రవహిస్తుండటంతో తాన్సా, మోదక్ సాగర్, కావడాస్, ధామినీ డ్యాంలలోని వరదనీటిని కిందకు విడుదల చేశారు. ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల మహానది పొంగి ప్రవహిస్తోంది. అల్పపీడనం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో 10 జిల్లాల్లోని 2 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. భద్రక్ జిల్లాలో వరదనీటితో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బైతారణి నది వరదనీటి ప్రవాహంతో భద్రక్ జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీవర్షాలతో నర్మద నది పొంగి ప్రవహిస్తోంది.నదిలో నీటి మట్టం పొంగి ప్రవహిస్తుండటంతో జిల్లా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, చెరువులకు కూడా భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో పలు చెరువులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కర్ణాటక, చత్తీస్ ఘడ్, ఢల్లీి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ అధికారులు ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు.