సొంత సర్కారుపై సిద్ధూ ఆగ్రహం
చండీగఢ్ : పంజాబ్లో 2015లో జరిగిన కోట్కాపురా పోలీసు కాల్పుల ఘటనలో దాఖలు చేసిన చార్జిషీట్ ఎక్కడని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కోట్కాపురా ఘటనపై ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశించిందని, దీనిపై ఏమి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చి ఆరు నెలలు గడచిపోయినా కాల్పుల ఘటనలో నిందితుడు మాజీ డీజీపీ సుమేద్ సింగ్ సైనీకి ఇచ్చిన బెయిల్పై స్పెషల్ లీవ్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 2015లో ఫరీద్కోట్లో గురుగ్రంథ సాహిబ్ను అపవిత్రం చేసిన ఘటనలను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన సిక్కు నిరసనకారులపై కాల్పులు జరిపిన పోలీసులపై సిద్దూ సొంత ప్రభుత్వాన్నే టార్గెట్ చేసుకోవడం చర్చనీయాంశమైంది.