లక్నో : ప్రజా సమస్యలకు సంబంధించి కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండు చేశారు. కాంగ్రెస్, ఎస్పీ ఉగ్రవాదులకు అనుకూలంగా సానుభూతివైఖరి ప్రదర్శిస్తున్నాయన్న ప్రధాని ఆరోపణలపై ప్రియాంక స్పందించారు. మోదీ ఆరోపణలు అవాస్తవమని ప్రజలతో పాటు ఆయనకు కూడా తెలుసన్నారు. కేవలం ఎన్నికల్లో గట్టెక్కేందుకే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. యూపీలో పెద్దసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. లక్నోలోని చిన్హత్ ప్రాంతంలో సోమవారం జరిగిన ప్రచార సభల్లో (రోడ్షోలు) ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ ప్రచార సమయంలో ఉత్సాహంగా అడుగులేస్తూ తన చుట్టూ ఉన్న కార్యకర్తలతో పాటు ప్రజల్ని కూడా ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్ షోలో ప్రియాంక యువతులు,మహిళలకు ‘లడ్కీ హూన్ లడ్ శక్తి హూన్’ రిస్ట్ బ్యాండ్లను పంపిణీ చేశారు. లక్నోలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి పట్టున్న మోహన్లాల్గంజ్ మినహా మిగిలిన అన్ని స్థానాలను బీజేపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఈసారి వీటిలో కొన్ని అయినా గెల్చుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ రోడ్షోలు నిర్వహించనున్నారు.