న్యూదిల్లీ : ఎన్సీపీ అధినేత శరద్పవార్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో బేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ఇద్దరి మధ్య 20 నిముషాల చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఆ వివరాలేవీ బయటకు రాలేదు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ నేతృత్వంతోని ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఎన్పీపీ తరపున హోంమంత్రిగా పని చేసిన అనిల్ దేశ్ముఖ్ను సీబీఐ కస్టడీలోకి తీసుకున్న నేపథ్యం, దీనికి తోడు అధికారంలో ఉన్న శివసేన కీలకనేత సంజయ్ రౌత్కు సంబంధించిన ఆస్తులను ఈడీ జప్తు చేసిన తరుణంలో శరద్ పవార్ ప్రధానితో బేటీ అవడం పలు ఊహాగానాలకు అవకాశం ఇచ్చింది
అభివృద్ధి పనుల కోసమే : అజిత్పవార్
రాష్ట్రంలోని అభివృద్ధి పనులపై చర్చించేందుకే ప్రధాని మోదీతో శరద్ పవార్ కలిశారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. బుధవారం ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానితో శరత్పవార్ బేటీపై ఎదురైన ప్రశ్నకు స్పందించారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తమ అధినేత ప్రధానితో కలిశారని తెలిపారు. తన వద్ద పూర్తి సమాచారం లేకపోయినా రాష్ట్రంలోని అభివృద్ధి పనుల విషయంలో కలసి ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న శివసేన, ఎన్పీపీ నేతలే టార్గెట్గా కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు దాడులు చేస్తున్న క్రమంలో శరత్పవార్ ప్రధాని మోదీతో బేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.