8 మంది సజీవదహనం
పశ్చిమబెంగాల్లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో 8 మంది సజీవ దహనమయ్యారు.తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి హత్యకు ప్రతీకారంగా వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. వివరాల్లోకి వెళితే, బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్హట్లో తృణమూల్ కాంగ్రెస్ పంచాయతీ నాయకుడు భదు ప్రధాన్ సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై నాటుబాంబులు విసరడంతో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే ఈ ఘటన జరిగినకొద్ది గంటల తర్వాత మంగళవారం తెల్లవారుజామున రాంపూర్హట్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మనుషల్ని లోపలపెట్టి, ఇళ్లకు తాళాలు వేసి నిప్పంటించినట్లు స్థానికులు చెబుతున్నారు. 10`12 నివాసాలకు నిప్పంటుకున్నాయి. 8మంది సజీవదహనమయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భధు ప్రధాన్ హత్యకు ప్రతీకారంగానే ఈ అల్లర్లు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.