రాంచీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం దిల్లీ తరలించనున్నారు. దీనికి సంబంధించి రిమ్స్ మెడికల్ బోర్డు సమావేశమై నిర్ణయం తీసుకుంది మరోవైపు రిమ్స్లోనే చికిత్స పొందుతున్న ఆర్జేడీ ఎంపీ ఆర్కే రాణాను దిల్లీకి తరలించేందుకు మెడికల్ బోర్డు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. పశువుల దాణ కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. అనారోగ్యం కారణంగా రాంచీలోని రిమ్స్లో చేరారు. అక్కడే చాలా రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స అందిస్తున్న చీఫ్ డాక్టర్ విద్యాపాటి.. దిల్లీలోని ఎయిమ్స్కు తరలించాలని సూచించారు. ఈ విషయంపైనే రిమ్స్ మెడికల్ బోర్డు సమావేశమైంది. జైళ్ల శాఖకు సంబంధించి అనుమతి పత్రం అందగానే లాలూను దిల్లీ తరలించనున్నారు.