స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి సూచనలు ఆహ్వానించిన ప్రధాని మోదీ
స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో దేశ ప్రజలు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జాతినుద్దేశిస్తూ చేసే ప్రసంగాలపై ప్రధాని మోదీ తరచుగా దేశ ప్రజల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానించే విషయం తెలిసిందే. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి సూచనలు ఆహ్వానించారు. మీ ఆలోచనలు, సూచనలు ఆగస్టు 15న ప్రధాని ప్రసంగంలో చోటుచేసుకొని ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రతిధ్వనిస్తాయి..ప్రధాని ప్రసంగం కోసం మీరు ఏ సూచనలు ఇస్తారో..వాటిని పంచుకోండంటూ శుక్రవారం ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చేసిన సెకన్ల వ్యవధిలోనే ప్రజలు తమ ఆలోచనలను పోస్టు చేయడం ప్రారంభించారు. చాలా మంది నెటిజన్లు పెగాసస్ సమస్య, రాఫెల్ విచారణ, ఇంధన ధరల పెరుగుదల, వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై మాట్లాడాల్సిందిగా అడిగారు. మరో ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, కొవిడ్ వల్ల భారత్లో నాలుగు లక్షల మంది మృతిచెందడం, స్లో వ్యాక్సినేషన్, అవినీతి, కొవిడ్ అనంతరం కూలీల జీవితాలపై దయచేసి మాట్లాడాల్సిందిగా కోరారు.