Friday, April 26, 2024
Friday, April 26, 2024

యూపీలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

61 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌
ఎన్నికలబరిలో 692 మంది అభ్యర్థులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదో విడతలో భాగంగా మొత్తం 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం పోలింగ్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విడతలో 692 మంది అభ్యర్థుల అదృష్టాన్ని ఓటర్లు నిర్ణయించనున్నారు. ఐదో విడతకు ప్రచార ఘట్టం శుక్రవారం సాయంత్రంతో ముగిసిందని, అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అజయ్‌ కుమార్‌ శుక్లా శనివారం లక్నోలో తెలిపారు. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సుల్తాన్‌పూర్‌, చిత్రకూట్‌, ప్రతాప్‌గఢ్‌, కౌశాంబి, ప్రయాగ్‌రాజ్‌, బారాబంకి, బహ్రైచ్‌, శ్రావస్తి,గోండా జిల్లాల్లో దాదాపు 2.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటలుగా భావించే అమేథీ, రాయ్‌బరేలీ, రామమందిర ఉద్యమానికి కేంద్రమైన అయోధ్యలో కూడా ఆదివారం పోలింగ్‌ జరగనుంది. ఐదో విడతలో పోటీల్లో ఉన్న ప్రముఖుల్లో కౌశాంబి జిల్లా సిరతు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఒకరు. అప్నా దళ్‌ (కామెరవాడి) అభ్యర్థి పల్లవి పటేల్‌తో ఆయన తలపడుతున్నారు. ఇక అలహాబాద్‌ వెస్ట్‌ నుంచి సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌, పట్టి (ప్రతాప్‌గఢ్‌) నుంచి రాజేంద్ర సింగ్‌, అలియాస్‌ మోతీ సింగ్‌, అలహాబాద్‌ సౌత్‌ నుంచి నంద్‌ గోపాల్‌ గుప్తా నాడి, మాన్కాపూర్‌ (గోండా) నుంచి రమాపతి శాస్త్రి పోటీలో ఉన్నారు.1993 నుండి కుండా నుండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌ అలియాస్‌ రాజా భయ్యా, అతని పార్టీ జనసత్తా దళ్‌ తరఫున మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన తన మాజీ సహచరుడు, సమాజ్‌ వాదీ పార్టీ గుల్షన్‌ యాదవ్‌ను ఎదుర్కోనున్నారు. ఇక కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌ తల్లి, అప్నాదళ్‌ (కె) నాయకు కృష్ణ పటేల్‌ ప్రతాప్‌గఢ్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అప్నాదళ్‌ (కె) సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌, తన తండ్రి సోనెలాల్‌ పటేల్‌ పేరుతో ఉన్న పార్టీ ప్రత్యర్థి వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. అయితే, ఆమె తల్లి కృష్ణ పటేల్‌ను సవాలు చేయడానికి ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ప్రతాప్‌గఢ్‌లోని రాంపూర్‌ ఖాస్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత ఆరాధన మిశ్రా మోనా పోటీ చేస్తున్నారు. ఆదివారం పోలింగ్‌ ముగిసే స్థానాలతో సహా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలోని 2మొత్తం 403 స్థానాల్లో 292 స్థానాలకు పోలింగ్‌ పూర్తయినట్లవుతుంది. మిగతా స్థానాలకు 6, 7 విడతలు అనగా మార్చి 3, 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఐదో దశకు గాను ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం చివరి రౌండ్‌ ప్రచారంలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సంయుక్తంగా అమేథీలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు.అమేథీ, ప్రయాగ్‌రాజ్‌, కౌశాంబి, బహ్రైచ్‌లలో జరిగిన వరుస ర్యాలీలలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img