డిప్యూటీ సీఎంలుగా పాఠక్, మౌర్య
52 మందితో మంత్రివర్గం
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వరుసగా రెండవసారి పాలనా పగ్గాలు చేపట్టారు. లక్నోలోని అతల్ బిహారీ వాజ్పేయి ఏకనా స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ చేత గవర్నర్ ఆనంది బెన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మౌర్య ఓటమి పాలయినప్పటికీ ఆయనను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా బ్రిజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రమాణ స్వీకారం చేశారు. యోగి ఆదిత్యనాథ్ 52 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, హరియాణా ముఖ్యమంత్రి ఎల్.ఎల్.ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్, ఆసోం సీఎం హేమంత్ బిస్వా శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.