దేశవ్యాప్తంగా జాతీయ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు , ఎక్స్ప్రెస్ వేలపై ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ట్యాక్సులు పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుత ట్యాక్స్పై పెంపుదల సగటున 4 నుంచి 4.5 శాతం వరకు ఉండనుంది. దీంతో సాధారణ ప్రజల రవాణా సాధనమైన బస్సు ప్రయాణం మరింత భారం కానున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు టోల్ ఫీజులతో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రజల సగటు జీవనం భారంగా మరనుంది. జాతీయ రహదారుల ఫీజు (డిటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలక్షన్) నిబంధనలు-2008 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏటా టోల్ట్యాక్సుల సవరణ చేపడుతున్నది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పెరిగిన టోల్ ట్యాక్స్ శనివారం నుంచి (ఏప్రిల్ 1) అమల్లోకి రానుంది. గతేడాది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వివిధ రకాల వాహనాలకు 10-15 శాతం వరకు టోల్ట్యాక్స్ను పెంచింది. ప్రస్తుతం జాతీ య రహదారులపై ప్రతి కిలోమీటర్కు అది రూ. 2.19గా ఉన్నది. తాజాగా మళ్లీ పెంచడంతో ప్రతి కిలోమీటరుకు రెండున్నర నుంచి 3 రూపాయల భారం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నాగపూర్ వరకు రూ.1000 వరకూ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుండగా, పెంపు తరువాత ఇది రూ.1100-1200 వరకు ఉండే అవకాశముందన్నారు.రాష్ట్రం పరిధిలో వివిధ మార్గాల్లో జాతీయ రహదారులపై 32 టోల్గేట్లు ఉండగా, వాటిపై ప్రస్తుతం రూ.1800 కోట్లకుపైగా టోల్ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం గడచిన తొమ్మిదేండ్లలో కేంద్రం టోల్చార్జీలను 300 శాతం పెంచడం గమనార్హం. టోల్ట్యాక్స్లను ఏటా 5 నుంచి 10 శాతం వరకు పెంచుతుండటంతో నిత్యావసర వస్తువుల భారం ఏటేటా పెరుగుతున్నది.