ముంబై: ఎల్గార్ పరిషద్-మావోయిస్టుల లింకు కేసులో నిందితులుగా ఉన్న కవి వరవరరావు బెయిల్ను ఈనెల 8 వరకు ముంబై హైకోర్టు మంగళవారం పొడిగించింది. ఆయన ఆరోగ్య కారణాల రీత్యా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నవీ ముంబైలోని తలోజా జైలులో (గతంలో ఈ జైలులోనే వరవరరావు ఉన్నారు) పరిస్థితులు మెరుగుపడ్డాయా లేదాని ప్రశ్నించింది. ఒకవేళ పరిస్థితులు మెరుగుపడకపోతే.. వరవరరావును తిరిగి అక్కడకు పంపితే… మరింత అనారోగ్యం బారిన పడవచ్చునని జస్టిస్ ఎస్ బి షుక్రే, జి సనప్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. గతేడాది ఫిబ్రవరిలో ఆరోగ్య కారణాల రీత్యా వరవరరావుకు ఆరు మాసాల పాటు తాత్కాలిక బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. కాగా, తన బెయిల్ను పొడిగించాలని, తన అనారోగ్యం దృష్ట్యా శాశ్వత బెయిల్ను ఇవ్వాలని కోరుతూ వరవరరావు పిటిషన్లు దాఖలు చేశారు. సెప్టెంబర్ నుంచి కోర్టు ఆయన బెయిల్ పొడిగిస్తూ వస్తోంది. కాగా, దీనిపై తదుపరి విచారణ మార్చి 8న చేపట్టనుంది.