న్యూదిల్లీ : దిల్లీ అగ్నిమాపక శాఖకు గురువారం 152 ఫోన్కాల్స్ వచ్చాయి. గతేడాదితో పోల్చుకుంటే ఇది 25 శాతం తక్కువ కాగా, గడచిన 5 ఏళ్లల్లో ఇదే అత్యంత తక్కువ. అగ్నిప్రమాదాలకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, మరణాలు సంభవించలేదని దిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. అగ్నిమాపకశాఖ లెక్కల ప్రకారం బాణసంచా కాల్చే సందర్భంలోను, మిగతా టపాకాయలు కాల్చే సమయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జరిగే ప్రమాదాలకు సంబంధించి సర్వసాధరణంగా ఈ ఫోన్ కాల్స్ విపరీతంగా వస్తాయని, అలాగే విద్యుత్ లైట్లతో అలంకరణ చేసే సమయంలో కూడా ప్రమాదాలు సంభవిస్తాయని అగ్నిమాపకశాఖ తెలిపింది. ‘ఈ ఏడాది దీపావళి సందర్భంగా అగ్నిప్రమాదాల ఫోన్ కాల్స్ సంఖ్యలో తగ్గుదల మంచి సంకేతాలను చూపుతోంది. దీపావళి సందర్భంగా కేవలం 152 కాల్స్ మాత్రమే నమోదు చేయడం ఇదే మొదటిసారి. గడచిన 15 ఏళ్లలో ఇవే అత్యంత తక్కువ కాల్స్’ అని గార్గ్ తెలిపారు. ప్రజల ఆలోచనా ధోరణిలోవచ్చి మార్పే దీనికి కారణం. చాలా తక్కువ కాల్స్ రావడం అంటే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉంటూ, మేం జారీ చేసిన జాగ్రత్తలను వారు కూడా కచ్చితంగా పాటించడం సంతోషించదగ్గ విషయమన్నారు. అగ్నిమాపకశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 152 కాల్స్లో, 117 కాల్స్ అగ్నిప్రమాదాలకు సంబంధించనవి కాగా, మిగిలిన కాల్స్ విద్యుదాఘాతం, చెత్తకు నిప్పుపెట్టడం వంటివని తెలిపారు.