Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కేరళలో భారీ వర్షాలు

పతనంతిట్టలో ముగ్గురి మృతి
పంపా నదిలో కొట్టుకుపోయిన వృద్ధుడు
7 జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌
కులులో ముగ్గురిని రక్షించిన అధికారులు
జమ్ము వరదల్లో దెబ్బతిన్న దుకాణాలు, ఇళ్లు, వాహనాలు

తిరువనంతపురం/పత్తనంతిట్ట: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బస్సును ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో కారు వాగులోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని వెన్నికులంలో చోటుచేసుకుంది. స్థానికులు వారిని రక్షించే సమయానికి చాంది మాథ్యూ, అతని భార్య, కుమార్తె ప్రవాహంలో మునిగిపోయారని పోలీసులు తెలిపారు. మరో ఘనటలో పతనం తిట్ట జిల్లాలోని అతిక్కాయం గ్రామంలో 60 ఏళ్ల వృద్ధుడు పంపా నదిలో కొట్టుకుపోయాడని, ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అతని కోసం వెతుకుతున్నారని జిల్లా అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరి కల దృష్ట్యా కొట్టాయం, ఎర్నాకులం జిల్లాల్లో క్వారీ, మైనింగ్‌ కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కొట్టాయంలో, జిల్లాలోని ఇల్లిక్కల్‌ ఇలవీజపూంచిర పర్యాటక కేంద్రాన్ని సందర్శించడానికి వచ్చిన 25 మంది వర్షాలలో ఇరుక్కుపోయారు. ప్రస్తుతం వారిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాల, పక్కనే ఉన్న ఇళ్లలో సురక్షితంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సహాయక చర్యలకు సహకరించేందుకు పార్టీ కార్యకర్తలందరూ ముందుకు రావాలని కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) చీఫ్‌, ఎంపీ కే సుధాకరన్‌ కోరారు. డీసీసీ కార్యాలయాలు, గ్రౌండ్‌ లెవెల్‌లో కంట్రోల్‌ రూమ్‌లను తెరవాలని సుధాకరన్‌ పార్టీని కోరారు. ఈ సంక్షోభ సమయంలో పార్టీ యూనిట్ల కార్యకర్తలు అందరూ ముందుకు రావాలని సహాయక చర్యల్లో భాగం కావాలన్నారు. భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తుండటం ఆందోళన కలిగిస్తోందని రాష్ట్ర రెవెన్యూమంత్రి కే రాజన్‌ అన్నారు. త్రిసూర్‌లో విలేకరులతో మాట్లాడిన మంత్రి, రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని ముఖ్యంగా కొల్లాం, కాయంకుళం, కొచ్చిలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని, ఫలితంగా విజింజం ఓడరేవు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఎర్నాకుళంలో, ఆగస్టు 4 వరకు జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన దృష్ట్యా, అన్ని శాఖలను సిద్ధం చేయాలని, మత్స్యకారు లను సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించినట్లు జిల్లా కంట్రోల్‌ రూమ్‌ తెలిపింది. కేరళలో ఆగస్టు 4 వరకు భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ ఆదివారం అంచనా వేసింది. ముందు వారం వివిధ జిల్లాల్లో ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. భారత వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల దృష్ట్యా, కొండ ప్రాంతాల్లో ఉన్నవారు అప్ర మత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యగా వర్షాలు కురిసిన వెంటనే వారిని సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆదివారం తెలిపారు. ఆగస్టు 1న రాష్ట్రంలోని తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు కేరళకు జారీ చేసిన జిల్లా వర్షపాత సూచన ప్రకారం, ఎనిమిది జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయబడిరది.
హిమాచల్‌ప్రదేశ్‌ వరదలు… ముగ్గురిని రక్షించిన అధికారులు
సిమ్లా: కులు జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించామని, 30 భవనాలను ఖాళీ చేసినట్లు సోమవారం అధికారులు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది బృందం ఆదివారం మనాలి జిల్లాలోని 14 మైళ్ల ప్రాంతానికి సమీపంలో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. మనాలిలోని బహాంగ్‌ గ్రామంలో వరదల కారణంగా బియాస్‌ నది వెంబడి ఉన్న నివాస భవనాలను కులు జిల్లా యంత్రాంగం ఖాళీ చేయించగా, కొత్తగా నిర్మించిన రెండు తాత్కాలిక ఫుట్‌బ్రిడ్జిలు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.
పాఠశాలల మూసివేత
జమ్ము: జమ్ముకశ్మీర్‌, పూంచ్‌ జిల్లాలోని సూరన్‌కోట్‌ పట్టణంలో సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో అధికారులు విద్యాసంస్థలను మూసివేసి, అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img