ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల్లో కొట్టుకుపోయిన ఘటనలు,కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకూ 136 మంది మృతి చెందారు. ఇందులో ఒక్క రాయ్గఢ్ ఘటనలోనే 47 మంది వరకు మృతి చెందారు. రాయ్గఢ్,రత్నగిరి,పాల్ఘర్,థానే,నాగ్పూర్,కొల్హాపూర్ జిల్లాలు ఇప్పటికీ జలదిగ్భంధంలోనే ఉన్నాయి. రాగల 24 గంటల్లో రాయ్గఢ్,రత్నగిరి,సింధుదుర్గ్,పుణే,సతారా,కొల్హారా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రత్నగిరి,సతారా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ముంబై,కొంకణ్ తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సెంట్రల్ మహారాష్ట్రతో పాటు,కొంకణ్,గోవా ప్రాంతాల్లో రాబోయే 2 రోజులు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. రాయ్గఢ్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వరదల కారణంగా 54 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. మరో 821 గ్రామాలు పాక్షికంగా నీట మునిగాయి.
గవర్నర్కు రాష్ట్రపతి ఫోన్
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం ఫోన్ చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల సహాయం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి రాష్ట్రపతికి గవర్నర్ వివరించారు. రాష్ట్రపతి భవన్ శనివారం ఓ ట్వీట్లో ఈ వివరాలను తెలిపింది. కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.