మంగళూరు: కర్ణాటకలో మరోసారి హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులు శనివారం మంగళూరు యూనివర్సిటీ కళాశాలకు రాగా వారిని అధికారులు అనుమతించలేదు. మళ్లీ సోమవారం కూడా వారు హిజాబ్ ధరించే వచ్చారు. మళ్లీ అధికారులు కళాశాలలోకి రానివ్వలేదు. ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉన్నందున దానిని పాటించాలని విద్యార్థులకు సూచించారు. అనుమతించాలంటూ విద్యార్థినులు పదేపదే డిమాండ్ చేస్తుండడంతో డిస్ట్రిక్ట్ డెప్యూటీ కమిషనర్ను ఆశ్రయించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. దీంతో విద్యార్థినులు దక్షిణ కన్నడ జిల్లా డెప్యూటీ కమిషనర్(డీసీ) రాజేంద్రను కలిసి, కళాశాల ప్రాంగణంలో ఇస్లామిక్ హెడ్స్క్రాఫ్(హిజాబ్) ధరించేందుకు అనుమతించాలని, విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించేందుకు మార్గం సుగమం చేయాలని కోరారు. ఈ మేరకు 12 మంది విద్యార్థినులు కమిషనర్కు మెమొరాండం సమర్పించారు.
హైకోర్టు ఆదేశాలకు కట్టుబడాల్సిందే…
ఈ వ్యవహారంపై డెప్యూటీ కమిషనర్ రాజేంద్ర స్పందిస్తూ… కళాశాల నిర్దేశించిన యూనిఫాంకు కట్టుబడి ఉండాలని విద్యార్థినులకు సూచించానని చెప్పారు. యూనివర్సిటీ అధికారులు హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారని, హిజాబ్ ధరించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం లోపలికి అనుమతించడంలేదని చెప్పారు. విద్యా ప్రాంగణాల్లో హిజాబ్ లేదా కాషాయ వస్త్రాలు ధరించడం వల్ల శాంతికి విఘాతం కలిగే అవకాశాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా జిల్లా స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేయొద్దని విద్యార్థినులకు సూచించానని రాజేంద్ర చెప్పారు. చట్టపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని, కళాశాల ఆవరణలో శాంతి, సామరస్యాల గురించి ఆలోచించాలని విద్యార్థినులకు సూచించానన్నారు. ఈ విషయంపై మంగళూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ పీ సుబ్రమణియం యడపడితయ మాట్లాడుతూ… హైకోర్టు, రాష్ట్రప్రభుత్వ ఆదేశాలకు యూనివర్సిటీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఆదేశాల అమలులో ఏ విద్యార్థికైనా సమస్య ఉంటే పరిష్కరించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.