మూడేళ్లకు ఎనిమిది మంది సభ్యుల ఎంపిక
న్యూదిల్లీ : శ్రీమాతా వైష్ణోదేవి ఆలయ బోర్డును జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తిరిగి ఏర్పాటు చేశారు. వేర్వేరు రంగాలకు చెందిన ఎనిమిది మందిని మూడేళ్ల వరకు సభ్యులుగా నామినేట్ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ను ఆలయ బోర్డు చైర్మన్ కూడా అయిన సిన్హా జారీచేశారు. ఎనిమిది మంది సభ్యులలో ఏఐఎంఐఎల్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ కేకే శర్మ, ముంబైకి చెందిన మహామండలేశ్వర్ సామి విశ్వేశ్వరానంద్ గిరిజీ మహారాజ్, ఐపీఎస్ రిటైర్డ్ అధికారులు అశోక్ భాన్, బాలేశ్వర్ రాయ్, జమ్మూ రిటైర్డ్ జడ్జి సురేశ్ కుమార్ శర్మ ఉన్నారు. ఆలయ బోర్డుతో దీర్ఘకాల సంబంధాన్ని కలిగివున్న శర్మ దాదాపు రెండు దశాబ్దాలకుపైగా వేర్వేరు సందర్భాల్లో వైష్ణోదేవి పుష్పాలంకరణ బాధ్యతలు చూస్తూ వచ్చారు. ఇప్పుడు బోర్డు సభ్యునిగా భక్తులకు సౌకర్యవంతమైన యాత్రకు కృషిచేస్తానని, ఇదే విషయమై బోర్డు సమావేశంలో ప్రతిపాదన చేస్తానని చెప్పారు. కాత్రా నుంచి ఆర్థ్కుమారి వరకు, అర్థ్కుమారి నుంచి భవన్ వరకు రోప్వే నిర్మాణాన్ని ప్రతిపాదిస్తానన్నారు. ఆలయాన్ని సందర్శించుకున్న భక్తులు ప్రత్యామ్నాయ మార్గంలో తిరిగి వచ్చేలా ఏర్పాట్లపైనా చర్చిస్తానన్నారు. తిరుపతి బాలాజీ తరహాలో భక్తుల కోసం దర్శనం, నిరీక్షణ గదులు వంటి సౌకర్యాల కల్పనపై దృష్టి పెడతామని చెప్పారు. వైష్ణోదేవి ఆలయం జమ్మూ జిల్లాలోని కాత్రా నుంచి 12 కిమీల దూరంలో 5,200 అడుగుల ఎత్తుతో ఉంది.