Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

వృద్ధిరేటు సరే`ఉద్యోగాలేవీ?

సత్య

‘‘భారత్‌కు కలసి వచ్చిన కాలం పేదలకు తోడ్పడుతోందా?’’ అంటూ మార్చినెల రెండవ తేదీన బ్రిటన్‌కు చెందిన ఎకానమిస్ట్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. ‘‘భారత నరేంద్రమోదీ సమస్య : అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ’’ మార్చినెల 19వ తేదీ ఆదివారం లండన్‌ నుంచి వెలువడే మరో పత్రిక ఫైనాన్సియల్‌ టైమ్స్‌ తన విశ్లేషణకు పెట్టిన శీర్షిక. ‘‘ ఏడాది కాలంగా వారానికి మూడువేల కోట్లు కోల్పోతున్న గౌతమ్‌ అదానీ, గరిష్ట స్థాయి నుంచి 60శాతం పడిన సంపద ’’ అని. ఎకనమిక్‌ టైమ్స్‌ మార్చి 22న ఒక విశ్లేషణను పాఠకులకు అందించింది. జాతీయవాదం పేరుతో తెలిసో తెలియకో ఊగిపోతున్నవారికి, మోదీ ఏలుబడిలో అచ్ఛేదిన్‌, అమృత కాలం అని నిజంగా నమ్ముతున్నవారికి లండన్‌ పత్రికల విశ్లేషణలు రుచిస్తాయా ? ఎవరేమి రాశారు ఎందుకు రాశారు అన్నది కాసేపు పక్కన పెట్టి నిజానిజాల గురించి లేవనెత్తిన అంశాల గురించి ఉద్రేకానికి లోనుకాకుండా ఆలోచించాలి.
‘‘కష్టాల్లో కూరుకుపోయిన శతకోటీశ్వరుడు గౌతమ్‌ అదానీకి గత ఏడాది కాలంగా వారానికి మూడువేల కోట్ల రూపాయలమేర దెబ్బతగిలింది. అతని సంపద 53 బిలియన్‌ డాలర్లకు పడిపోయిందని (మార్చి 22న విడుదల చేసిన) ఎం3ఎం హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ జాబితా 2023లో చూపారు’’ అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషకుడు ఒకరు విశ్లేషణను ప్రారంభించారు. ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. ఎన్ని రోజులైనా పార్లమెంటు జరగకపోయినా సరే అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద పార్లమెంటరీ కమిటీ విచారణకు అంగీకరించేది లేదంటూ భీష్మించుకున్న ప్రధాని మోదీ మొండి పట్టుదల ఒకవైపు. ఎలాగైతేనేం ఎంత డబ్బు సంపాదించారనేదే ముఖ్యం అన్నట్లుగా ఆలోచిస్తున్న సమాజం మరొక వైపు కనిపిస్తున్నపుడు తరిగిపోతున్న అదానీ సంపదల గురించి గుండెలు బాదుకోక ఏమి చేస్తారు.
2022 సెప్టెంబరు చివరి వారంలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హరూన్‌ ఇండియా రిచ్‌ జాబితా వెల్లడిరచిన సమాచారం ప్రకారం, 2021లో అదానీ కుటుంబం రోజుకు రు.1,612 కోట్లు, ముకేష్‌ అంబానీ రు.210 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నది. ఒక దశలో అదానీ కంటే అంబానీ సంపద రెండు లక్షల కోట్లు ఎక్కువ, అలాంటిది ఏడాది కాలంలోనే అంబానీని వెనక్కు నెట్టి అదానీ మూడులక్షల కోట్లు ఎక్కువ, అంటే ఏడాదిలో ఐదులక్షల కోట్లు సంపాదించాడు. అబ్రకదబ్ర, మాయలు మంత్రాలు చేసే గంధర్వులకు, మిత్రమా ఏమి నీ కోరిక, తథాస్తు అనే పైవారు ఉంటే తప్ప మానవమాత్రులకు సాధ్యమా? 2012లో అంబానీ సంపదతో పోలిస్తే అదానీ దగ్గర ఆరోవంతు మాత్రమే ఉంది. 2014లో కేవలం ఎనిమిది బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అదానీ 2022 నాటికి 137 బిలియన్‌ డాలర్లకు ఎదిగారు. వందల సంవత్సరాలుగా ఆ రంగంలో ఉన్నవారికి సాధ్యం కానిది ఇంత స్వల్పకాలంలో అదానీకి ఎలా వచ్చింది, ఇతరులకు ఎందుకు రాలేదు అన్నది ఎప్పుడైనా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషించిందా ? మిగతా పత్రికల తీరుతెన్నులు కూడా అవే. బ్లూమ్‌బెర్గ్‌ తాజా బిలియనీర్ల జాబితా ప్రకారం, ఈ ఏడాది జనవరి 24న 119 బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అదానీ ఇప్పుడు 57.2 బిలియన్‌ డాలర్లకు దిగజారారు. హరూన్‌ సంస్థ అంచనా 53 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ముకేష్‌ అంబానీ 82 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు.
వృద్ది ఫలాలు ఎవరికి దక్కుతున్నాయన్నదే చర్చ. వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగాలు పెరుగుతున్నది కొన్నే. పోనీ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు చెబుతున్న ఊట సిద్ధాంతం ప్రకారం పెరిగిన సంపదలు దిగువ వారికి చేరుతున్నాయా అంటే చివరికి అచ్ఛేదిన్‌, తాజాగా అమృత కాలం అని చెప్పిన మోదీ తొమ్మిదేండ్ల పాలన తరువాత మన్‌కీబాత్‌లో కూడా చెప్పే ధైర్యం చేయలేదు. దేశంలో జనవరిలో 7.14శాతంగా ఉన్న నిరుద్యోగం ఫిబ్రవరిలో 7.45శాతానికి పెరిగిందన్న సిఎంఐఇ సమాచారాన్ని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఉటంకించింది. నైపుణ్య శిక్షణ పథకాన్ని మన్మోహన్‌ సింగ్‌ కాలంలోనే ప్రారంభించారు. దానికి ఒక మంత్రిని, కేటాయింపులను పెంచి అసలు దానికి ఆద్యుణ్ణి తానే అన్నట్లుగా నరేంద్రమోదీ ప్రచారం చేసుకున్నారు. నిజం ఏమిటి ? ‘‘మనది ప్రధానంగా కార్పొరేట్‌ వృద్ధి మాత్రమే. ఒక యూనిట్‌ ఉత్పాదనకు భారత కార్పొరేట్లు ఎక్కువ మంది జనాలను నియమించటం లేదు. ఒక వైపు యువతకు ఉద్యోగాలు రావటం లేదు. మరోవైపు తమకు నిపుణులైన జనాలు దొరకటం లేదని కంపెనీలు ఫిర్యాదు చేస్తున్నాయి. జీవితకాల ఉపాధికి ప్రభుత్వ ఉద్యోగం అవసరమని ఆకాంక్షిస్తున్నారు, నూటనలభై కోట్ల మంది జనాభాతో పోలిస్తే అవి చాలా తక్కువ.’’ అని ప్రణాళికా సంఘ మాజీ ప్రధాన సలహాదారు ప్రణబ్‌ సేన్‌ చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది. ‘‘నైపుణ్యాలు దొరకటం మరొక సమస్య. అనేక కంపెనీలు ఇప్పటికే డిమాండ్‌ ఉన్న నైపుణ్యాలను వృద్ధి చేసుకున్న వారిని తీసుకుంటున్నాయి. భారత్‌లో ఫైనాన్స్‌, బీమా, రియల్‌ఎస్టేట్‌, పొరుగుసేవలు, టెలికాం, ఐటి రంగాలలో ఎక్కువ వృద్ధి ఉంది. అయితే ఇవి ఉపాధిని సృష్టించేవి కాదు’’ అని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అర్థశాస్త్రవేత్త ఫ్రొఫెసర్‌ అమిత్‌ భోస్లే చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొంది. భారత్‌లో ఉపాధి సమస్య పరిష్కారం కావాలంటే ఇరవై సంవత్సరాలపాటు వార్షిక వృద్ధి రేటు పద్దెనిమిది శాతం ఉండాలని ఐదేండ్ల క్రితం ప్రపంచబాంకు అంచనా వేసింది. చిత్రం ఏమిటంటే తన విధానాలతో ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా జిడిపి వృద్ది రేటును తమ ప్రభుత్వం సాధిస్తున్నట్లు మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్నది. మోదీ అధికారానికి వచ్చిన తొలి సంవత్సరాల్లో ఐదుశాతానికి అటూ ఇటూగా ఉన్న నిరుద్యోగ రేటు ప్రస్తుత 7`8శాతం మధ్య ఉంది. శ్రామిక శక్తి భాగస్వామ్య అంశంలో రెండు వందల దేశాల సమాచారాన్ని గ్లోబల్‌ ఎకానమీ డాట్‌కామ్‌ విశ్లేషించింది. దాని ప్రకారం 2021లో 87.3శాతంతో ఖతార్‌ ఒకటవ స్థానంలో ఉంది. మన దేశంతో సమంగా జనాభా ఉన్న చైనా 68.6శాతంతో 42వది కాగా మన దేశం 45.57 శాతంతో 159వ స్థానంలో ఉంది.
దేశంలో ఉపాధి రహిత వృద్ధి ఆందోళన కలిగిస్తోందని, వృద్ధికి అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహీంద్రా కూడా చెప్పారు. అమెరికాలో కార్మిక శక్తి భాగస్వామ్యం 62శాతం కాగా, మన దేశంలో 40శాతమని(2022) చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2020 ఆర్థిక సర్వేలో 2025 నాటికి మంచి వేతనాలు ఉండే ఉద్యోగాలను నాలుగు కోట్లు, 2030నాటికి ఎనిమిది కోట్లు కల్పించగలమని, చైనా తరహా వృద్ధి విధానాన్ని అనుసరించాలని కూడా దానిలో పేర్కొన్నారు. దేశంలోని పెద్ద పట్టణాల్లో స్విగ్గి, జొమాటో వంటి కాలక్షేప ఉద్యోగాలుచేసే వారి సంఖ్య పెరుగుతోంది. గ్రామాల్లో అలాంటి అవకాశాలు కూడా ఉండటం లేదు. వృద్ధికి అనుగుణంగా ఉపాధి లేదు, ఉన్న ఉపాధికి పొందుతున్న వేతనం కూడా నామమాత్రంగా ఉంది. తగినంత వేతనం లేకుండా కొనుగోలు శక్తి పెరగదు. స్థానిక కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగానే ఎగుమతి మార్కెట్లో తేడాలు వచ్చినా చైనా తట్టుకోగలుగుతోంది. మనదేశంలో ఆ పరిస్థితి ఉందా?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img