Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పై స‌స్పెన్ష‌న్ వేటు

విశాలాంధ్ర – బల్లికురవ : వైద్యో నారాయణో హరి అంటారు పెద్దలు.కానీ నిన్న మొన్నటి వరకు గుంటుపల్లి ప్రభుత్వ వైద్యశాలలో వర్గ పోరుతో తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.ఇటీవల కాలంలో డాక్టర్లు తరచూ మమ్మల్ని వేధిస్తున్నారంటూ వైద్య సేవలో కొనసాగుతున్న మహిళా ఉద్యోగులు తల్లడిల్లిపోయారు.అంతేకాకుండా వైద్యశాలలో జరిగే సమావేశానికి రావాలంటేనే ఏఎన్ఎంలు హడలి పోయేవారు.శాఖాపరంగా వైద్యాధికారి సంతకంతో అవసరం వచ్చినప్పుడల్లా తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓపిక నశించిన మహిళా మూర్తులు తాము వైద్యాధికారి రూపంలో ఎదుర్కొంటున్న వికృత చేష్టలు, వింత ప్రవర్తన లు ఇటీవల మీడియా ప్రతినిధులకు ఏకరువు పెట్టుకున్నారు.అంతేకాకుండా శాఖాపరంగా ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని చేరవేయడంతో ఉన్నత అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేసి ఉన్నత అధికారులకు నివేదికను అందించారు.శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల.రజనీ రాక డాక్టర్ సస్పెన్షన్ రూపంలో ముగింపు పడింది.వైద్యశాలకు వచ్చిన ఆమె తొలుత హాస్పటల్ అపరిశుభ్రత పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఔషధ దుకాణంలో ఉన్న మందులను, రికార్డులను పరిశీలించారు.ఆపరేషన్ థియేటర్లో బొద్దింకలు ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఏఎన్ఎం లతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం వైద్యాధికారి పై ఆరోపణలు వాస్తవం అని తేలడంతో పత్రికా ముఖంగా సస్పెన్షన్ ప్రకటన తెలియజేశారు.కోట్లాది రూపాయలు ప్రభుత్వం వెచ్చి స్తుంటే వైద్యశాల నిర్వహణలో ఇంతటి నిర్లక్ష్యమే అంటూ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే సిబ్బంది పనితీరు మార్చుకొని హాస్పిటల్ కి వచ్చే రోగులు పట్ల ప్రత్యేక దృష్టిసారించాలని లేనిపక్షంలో ఎంతటి వారి పైన అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.గుంటుపల్లి ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరుగుతుందని హాస్పిటల్ లోని ఖాళీలను త్వరితగతిన పూర్తి చేస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు.ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చిత్తశుద్ధితో ముందుకు పోతున్నారని, తదనుగుణంగానే ప్రభుత్వ వైద్యశాలలో సకల సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్ హాస్పిటల్ కు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తయారు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్యం అందక,వైద్యం చేయించుకోలేక మరణించకూడదు అనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకంతో ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందిస్తున ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.ఇకనుండి ఏ విధమైన సమస్యలకు తావులేకుండా ప్రభుత్వ వైద్యశాలలో సకల సౌకర్యాలు కలుగు చేస్తారని,గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం అందజేస్తున్న నాణ్యమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ప్రసూతి కాన్పుల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లి ఆర్థికంగా నష్టపో వద్దని,నాణ్యమైన వైద్యం అందించే ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.వైద్యశాల పరంగా ఏవైనా సమస్యలు వస్తే తక్షణమే కృష్ణ చైతన్య కు తెలియజేయాలని,ఆయన ద్వారా తన దృష్టికి వస్తే అప్పటికప్పుడు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.ఈ సందర్భంగా ఆమె వెంట అద్దంకి వైఎస్ఆర్ సీపీ ఇన్చార్జి బాచిన కృష్ణ చైతన్య,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్, బల్లికురవ సహకార సంఘం అధ్యక్షులు గుర్రం.రంగారావు, సంతమాగులూరు ఏఎంసీ చైర్మన్ చింతల.పేరయ్య, ఎంపీపీ బడుగు.శ్రీలక్ష్మి,వైస్ ఎంపీపీ ఇప్పల.వెంకటసుబ్బారెడ్డి, గుంటుపల్లి గ్రామ సర్పంచి మాదాల.కృష్ణకుమారి శివన్నారాయణ,మండల కో ఆప్షన్ సభ్యులు షేక్.శ్రీనువలి, మండల ప్రచార కమిటీ అధ్యక్షుడు టి.నరేష్, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img