టీమిండియా ముమ్మర సాధన
ముంబై: టీమిండియా సాధన షురూ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్, జయదేవ్ ఉనద్కత్.. ఇలా కీలక ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి టెస్టుకు నాగ్పుర్ వేదికగా నిలిచింది. స్వదేశంలో సిరీస్ అనగానే భారత్ స్పిన్ పిచ్లకే ప్రాధాన్యం ఇస్తుందనే అంచనాలు ప్రత్యర్థి జట్టుతోపాటు క్రికెట్ విశ్లేషకుల్లోనూ ఉన్నాయి. దీంతో భారత ఆటగాళ్లు కూడా స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రాక్టీస్ సెషన్లోనే నలుగురు స్పిన్నర్లను నెట్బౌలర్లుగా ఎంపిక చేసుకొంది. అందులో వాషింగ్టన్ సుందర్, ఆర్ సాయి కిశోర్, సౌరభ్ కుమార్తోపాటు రాహుల్ చాహర్ ఉన్నాడు. వీరిలో రాహుల్ చాహర్ లెగ్ స్పిన్నర్ కాగా.. మిగతా ముగ్గురు ఆఫ్ బ్రేక్ బౌలర్లు. ఇప్పటికే పేసర్లు సిరాజ్, జయ్దేవ్ బౌలింగ్లో భారత బ్యాటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా నలుగురు స్పిన్నర్లతో ఇక్కడకు వచ్చింది. అందులో ముగ్గురు ఆఫ్ స్పిన్నర్లు కాగా.. మరొకరు లెగ్ స్పిన్నర్. నాథన్ లియాన్, ఆష్టన్ అగర్, టాడ్ మర్ఫీ, మిచెల్ స్వేప్సన్ ఉన్నారు. అంతేకాకుండా మరో ఇద్దరిని పార్ట్టైమ్ బౌలర్లను సిద్ధం చేసుకోవడం గమనార్హం. బ్యాటర్లు ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ కూడా స్పిన్ బౌలింగ్ను వేసేలా ఆసీస్ జట్టు తర్ఫీదు ఇచ్చింది. అంతేకాకుండా బెంగళూరులో జరుగుతున్న తమ ప్రాక్టీస్ సెషన్స్ కోసం బరోడా ఆటగాడు మహీశ్ పితియాను కూడా రప్పించుకొంది. అచ్చం రవిచంద్రన్ అశ్విన్ మాదిరిగా బౌలింగ్ వేస్తాడనే పేరు రావడంతో ఆసీస్ బృందం ఈ నిర్ణయం తీసుకొంది.