దుబాయ్ : ఐపిఎల్లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు దాదాపు మృగ్యమయ్యాయి. శనివారంనాడు జరిగిన కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఢల్లీి క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఢల్లీి క్యాపిటల్స్ ప్లే ఆఫ్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. మరోవైపు ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్లో దిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు.
130 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో ఎదురుదెబ్బలు తిన్నది. పృథ్వీషా (6), శిఖర్ధావన్ (8), స్టీవెన్ స్మిత్ (9)లు అనూహ్యంగా అవుటయ్యారు. పృథ్వీని కృనాల్ పాండ్యా మంచి లైన్ అండ్ లెన్త్ బంతితో ఎల్బీగా వెనక్కి పంపించగా, స్మిత్ ఊహించని రీతిలో కౌల్టర్ నైల్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ కళ్లు చెదిరే త్రోతో శిఖర్ ధావన్ రనౌట్ చేశాడు. ఈ అవుట్తో ఐపీఎల్ చరిత్రలోనే ధావన్ చెత్త రికార్డు నమోదు చేశాడు. జయంత్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఆఖరి బంతిని ధావన్ మిడాన్ దిశగా షాట్ ఆడాడు. అయితే రిస్క్ అని తెలిసినా ధావన్ అనవసర సింగిల్కు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పొలార్డ్ బంతిని అందుకొని డైరెక్ట్ త్రో విసిరాడు. ధావన్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేయడంతో రనౌట్ అయ్యాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 16 సార్లు రనౌట్ అయిన ధావన్.. గంభీర్తో సమానంగా తొలిస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత సురేశ్ రైనా 15 సార్లు రనౌట్తో రెండో స్థానంలో.. అంబటి రాయుడు, డివిలియర్స్లు 13 సార్లు రనౌట్ అయి మూడవ స్థానంలో నిలిచారు. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దిల్లీని రిషబ్ పంత్ (26), శ్రేయాస్ అయ్యర్ (33)లు గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. రిషబ్, అక్షర్ పటేల్ (9)లు అవుటయ్యాక హిట్మెయిర్ (15), రవిచంద్రన్ అశ్విన్ (20)లు బాధ్యతాయుతంగా ఆడి జట్టును గెలిపించారు. అంతకుముందు, దిల్లీ క్యాపిటల్స్ టాస్గెలిచి ముందుగా ముంబై ఇండియన్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ (7) మరోసారి విఫలమయ్యాడు. ఆవేష్ఖాన్ బౌలింగ్లో రబడ పట్టిన క్యాచ్కు అతను పెవిలియన్ దారిపట్టాడు. ఆ తర్వాత డీకాక్ (19), సూర్యకుమార్ యాదవ్ (33), సౌరభ్ తివారీ (15)లు రాణించే ప్రయత్నం చేశారు. కృనాల్ పాండ్యా (17), హార్దిక్ పాండ్యా (17)లు కూడా గట్టిగా నిలదొక్కుకునేందుకు యత్నించారు. కానీ దిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతంగా ఆడి ముంబైని కట్టడి చేశారు. దిల్లీ బౌలర్లలో ఆవేష్ఖాన్, అక్షర్ పటేల్లు మూడేసి వికెట్లు, నార్యే, అశ్విన్లు చెరొక వికెట్టు తీసుకున్నారు.