సిడ్నీ : పాకిస్థాన్ పర్యటనకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత పాక్లో ఆసీస్ సిరీస్ ఆడేందుకు వెళ్తుండటం విశేషం. ఈ పర్యటనలో మూడేసి టెస్టులు, వన్డేలు, ఒక టీ20 జరగనున్నాయి. 1998లో చివరిసారిగా ఆసీస్ పాక్లో పర్యటించింది. ఈ టూర్లో జరిగిన మూడేసి టెస్టులు, వన్డేల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆ తర్వాత చాలాసార్లు పర్యటనలు ఖరారైనా.. వివిధ కారాణాలతో రద్దవుతూ వచ్చాయి. భద్రతా సమస్యల కారణంగా చాలాకాలంగా అగ్రదేశాలు పాక్లో టోర్నీలు ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. కానీ కొంతకాలంగా అక్కడి పరిస్థితులు దారికొచ్చినట్లు కనిపించిన నేపథ్యంలో శ్రీలంక, జింబాబ్వే, దక్షిణాఫ్రికా.. పాక్లో పర్యటించాయి.
ఆ తర్వాత పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగడం వల్ల ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి జట్లు పాక్లో సిరీస్లు ఖరారు చేసుకున్నాయి. పాక్ పర్యటనకు వెళ్లి కొద్ది నిమిషాల్లో టాస్ పడుతుందనగా.. ఈ పర్యటన నుంచి వైదొలిగి పీసీబీకి కివీస్ గట్టి షాకిచ్చింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ కూడా తమ పాక్ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ సిరీస్లపై ఇప్పటివరకు స్పష్టత రాకపోయినా ఆసీస్ పాక్లో పర్యటించేందుకు సిద్ధమైంది.