మాంగల్య షాపు వద్దకు పోనీకుండా ర్యాలీని బస్టాండ్ లోనే ఆపివేసిన పోలీసులు
మూడు గంటలసేపు ధర్నా నిర్వహణ
తాసిల్దార్ హామీ మేరకు తాత్కాలికంగా ధర్నా విరమణ.. ధర్మవరం పట్టుచీరల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి
విశాలాంధ్ర-ధర్మవరం:: గత కొన్ని నెలల కిందట ధర్మవరం పట్టణంలో మాంగల్య షాపింగ్ మాల్ ప్రారంభించడంతో పట్టణములోని చిన్న పెద్ద వ్యాపారస్తులు యొక్క వ్యాపారం పూర్తిగా డీలా పడడంతో పట్టణ వ్యాపారస్తులు, రెడీమేడ్ అండ్ టెక్స్టైల్స్ వ్యాపారస్తులు దాదాపు 200 మందికి పైగా తమ నిరసనను తెలియజేశారు. ఇందులో భాగంగా పట్టణములోని పుట్లమ్మ గుడి వద్ద నుంచి వివిధ కూడలిని ద్వారా ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. పుట్టపర్తి రోడ్డులో గల మాంగల్య షాపు వద్దకు చేరుకునేందుకు వన్టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం అడ్డుకోగా, ఆర్టీసీ బస్టాండ్ వద్ద వ్యాపారస్తులందరూ కూడా భీష్మించి రోడ్డు వద్దనే తమ నిరసన ధర్నాను నిర్వహించారు. అనంతరం గిర్రాజు రవి, నీలూరి శ్రీనివాసులు, పోలా వెంకట నారాయణ, కోటి వెంకటేష్…. తదితరులు మాట్లాడుతూ పూర్వీకుల నుండి ధర్మవరం పట్టణంలో చేనేత పరిశ్రమను నమ్ముకొని వందలాదిమంది జీవనం కొనసాగిస్తున్నారని, అలాంటిది ఈ మాంగల్య షాపింగ్ మాల్ రావడం వలన కనీసం బోని కూడా కావటం లేద ని, వ్యాపారం చేసుకోవడానికి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, అవి ఎలా తీర్చాలో మాకు తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, అప్పటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హామీ ఇచ్చి మాట తప్పడంతో మా బ్రతుకులు రోడ్డున పడ్డాయని తెలిపారు. ఇప్పటికే పదుల సంఖ్యలో రెడీమేడ్ అండ్ టెక్స్టైల్ షాపులు, చిన్న పెద్ద వ్యాపారాలు మూసివేయబడ్డాయని తెలిపారు. ఈ ర్యాలీ చేసేటప్పుడు ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించగలిగారు. కేజీల ప్రకారం మాంగల్య షాపింగ్ మా వాళ్లు విక్రయాలు చేస్తుంటే, ప్రజలు మోసపోతున్నారని తెలిపారు. అంతేకాకుండా నాణ్యత కలిగిన చీరలు, తదితర వస్త్రాలు ధర్మవరంలో మాత్రమే లభ్యమవుతున్నాయని, కానీ మాంగల్య షాపింగ్ మాల్ వారు రాష్ట్రంలో ఉన్నటువంటి తమ బ్రాంచ్లలో మిగిలిన వస్త్రాలను తీసుకొచ్చి తక్కువ రేటుకు అమ్మడం, లేదా నాణ్యతలేని వస్త్రాలను కేజీల ప్రకారం అమ్మడం దారుణమని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల కిందట చెన్నై సిల్క్స్ ధర్మవరంలో ప్రారంభించే సమయంలో పట్టణ వ్యాపారస్తులంతా పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అప్పటి పోలీసులు మాకు సహకరించడంతో ఆ చెన్నై సిల్క్ నిరానీయకుండా చేయడం జరిగిందన్నారు. కానీ నేడు రాజకీయాలు జోక్యం చేసుకొని మా జీవన విధానమైన వ్యాపారాలను దెబ్బతీయడం సరి అయిన పద్ధతి కాదని వారు హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా తమ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే, కొంతమంది మా పోరాటాలను ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా బెదిరేది లేదని, మా పోరాటాలను కొనసాగిస్తామని, అంతేకాకుండా నిరాహార దీక్షలకు ఆత్మహత్యలకు వెనుకాడేది లేదని వారు తెలిపారు. మొత్తం మీద ఈ ధర్నా కార్యక్రమం అధికం కావడంతో టౌన్ సిఐ సుబ్రమణ్యం జోక్యం చేసుకొని ఆర్డిఓ, ఎమ్మార్వో, కమిషనర్లకు సమాచారాన్ని అందజేశారు. ఆర్డీవో కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమ్మార్వో రమేష్ ధర్నా స్థలము వద్ద చేరుకొని, ధర్నా చేస్తున్న వ్యాపారస్తుల వద్ద గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మార్వో రమేష్ మాట్లాడుతూ ధర్మవరం పట్టు చీరలకు ప్రసిద్ధి కాంచిందని, అలాంటప్పుడు ఈ మాంగల్య షాపింగ్ మాల్ పెట్టడంలో కొంతవరకు వ్యాపారాలు నష్టాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని ఆర్డీవో తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి, మాంగల్య షాపింగ్ వాళ్లకు నోటీసులను పంపిస్తామని, వారితో చర్చించి, సాధ్యమైనంతవరకు మాంగల్య షాపింగ్ మాల్ను తొలగించేందుకు తన వంతుగా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. దీంతో వ్యాపారస్తులందరూ కూడా ఎమ్మార్వో ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా ధర్నాను విరమించారు. మా సమస్యలు పరిష్కరించకపోతే పట్టణ బందును అతి త్వరలో వ్యాపారస్తులతో చర్చించి బందును కూడా చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వ్యాపారస్తులు, రెడీమేడ్ అండ్ టెక్స్టైల్స్ వ్యాపారస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టు చీరల వ్యాపారస్తుల సంఘం సభ్యులు, పట్టణ వ్యాపారస్తులు రెడీమేడ్ అండ్ టెక్స్టైల్స్, గార్మెంట్స్ వ్యాపారస్తులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ధర్నా విజయవంతం చేశారు.