రేవంత్ సహా కాంగ్రెస్ శ్రేణుల అరెస్టు
విశాలాంధ్ర ` హైదరాబాద్ : పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఏఐసీసీ పిలుపుమేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్భవన్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాజ్భవన్ వైపు వెళ్ళేందుకు ప్రయత్నించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో అనేక మంది కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమానికి పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి సహా పలువురు నాయకులు మాట్లాడుతూ గడిచిన ఏడేళ్ళ కాలంలో మోదీ సర్కార్ సుమారు రూ. 36లక్షల కోట్లను పెట్రోల్ డీజిల్ పేరిట దోచుకుందని ఆరోపించారు. స్వాతంత్య్రం కావాలన్నప్పుడు కాంగ్రెస్ తెచ్చింది, అలాగే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్టలేదని నిమ్స్లో మందులు వేసుకొని మందు తాగి పండుకున్నాడని ఎద్దెవ చేశారు. కాంగ్రెస్ మాత్రం ఏపీలో చచ్చిపోయి తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. త్యాగం కాంగ్రెస్ది.. నష్టం జరిగిందీ కాంగ్రెస్కేనని, త్యాగం కేసీఆర్ది కాదని రేవంత్ అన్నారు. తెలంగాణలో రెండు సార్లు కేసీఆర్ అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చాడని, గడిచిన ఏడేళ్ళలో బడుగు, బలహీన వర్గాలు, రైతులు నిత్యం దోపిడికి గురవుతునే వున్నారని అవేదన వ్యక్తం చేశారు. గతంలో 2 వంతులు అసలు ధర ఉంటే, 1 వంతు పన్ను ఉంటుండే కాని ఇప్పుడు 1వంతు రేట్ ఉంటే వంతులు పన్నులను ఈ ప్రభుత్వాలు మోపుతున్నాయని విమర్శించారు. పక్కనే వున్న మలేషియాలో రూ.37, పాకిస్తాన్లో రూ.57 వుంటే మన దేశంలో మాత్రం ఏకంగా రూ.105కు ధరలు ఎలా చేరుకున్నాయని ప్రశ్నించారు. ఇలా ప్రజల సోమ్మును దోచుకుంటున్న మోదీ, కేసీఆర్ ఫ˜ోటోలను దోంగలున్నారు జాగ్రత్త అంటూ పెట్రోల్ బంక్లలో పెట్టాలని అన్నారు. ప్రజల తరఫున ఉద్యమిస్తే ఈ ప్రభుత్వం పోలీసుల సహకారంతో కాంగ్రెస్ శ్రేణులను ఎన్ని అరెస్టులు చేసిన ఇంతమంది వచ్చారని పేర్కొన్నారు. ప్రతీ మనిషి మీద లక్ష రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే, 5 లక్షల రూపాయలు నరేంద్రమోదీ చేశాడని, ప్రస్తుతం ఒక్కొక్కరి మీద 6 లక్షల రూపాయల అప్పు చేశారని వివరించారు. కేసీఆర్ది రెండేళ్లు మాత్రమేని తరువాత వచ్చేది సోనియాగాంధీ రాజ్యమే అని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఐపిఎస్ ఐజీ ప్రభాకర్ రావు కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నరని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇప్పటి నుండే ఇతర దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకున్న పనిలో పడ్డారని వారు ఎక్కడికి వెళ్ళిన వారిని వదిలేది లేదన్నారు. ఇంటలిజెన్స్ ప్రభాకర్రావు కూడా ఇతర దేశాల పాస్పోర్టు తెచ్చుకోవాలన్నారు. గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇస్తామంటే ఆమె వెళ్లి పాండిచ్చేరి వెళ్లారని కావు అటు గవర్నర్, కేసీఆర్ల మీద నమ్మకం లేదని కాని మాకు అంబేద్కర్ మీదనే నమ్మకం వుందని అందుకే ట్యాంక్ బండ్ మీదున్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా ట్యాంక్బండ్ వైపు వెళ్ళేందుకు రేవంత్రెడ్డి పోలీస్ బారికెట్లను ఎక్కిదూకి వెళ్ళారు. దీంతో పోలీసులు అతనితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్యాదవ్లను అరెస్టు చేసి అంబర్పేట పోలీస్స్టేషన్కు తరలించారు. అలాగే టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్స్టేషన్కు తరలించారు.
కాంగ్రెస్ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం..
శాంతియుంతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఈ ప్రభుత్వం, పోలీసులు అందుకు సహకరించకుండా అప్రజాస్వామ్య పద్దతిలో కాంగ్రెస్ శ్రేణులను అరెస్టు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ఆలీ, బలరాంనాయక్లు అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా శాంతియితంగా ప్రదర్శన చేస్తుంటే అడ్డుకొని అరెస్ట్ చేయడం మోడీ, కేసీఆర్ ల అరచకానికి పరాకాష్టగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల అరెస్టులను వారు ఖండిరచారు. అన్ని జిల్లా కేంద్రాలలో మోడీ, కేసీఆర్ల దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.