మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
విశాలాంధ్ర, హైదరాబాద్ : భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురైన సరూర్ నగర్, నాగోల్ ప్రాంతాల్లోని కాలనీలకు ముంపు నుండి శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలియజేశారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన గడ్డిఅన్నారం, నాగోల్ పరిసర ప్రాంతాల్లో మేయర్ విజయలక్ష్మి శుక్రవారం విస్తృంతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతాలు ముంపునకు గురికాకుండా చేపట్టనున్న చర్యలపై గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, నాగోల్ కార్పొరేటర్ అరుణలతో కలిసి జిహెచ్ఎంసి ఇంజనీర్లతో శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ. భారీ వర్షాల వల్ల సరూర్ నగర్ చెరువుకు అధికపరిమాణంలో వచ్చే వర్షపునీటిని బయటకు విడుదల చేసిన సందర్భంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా అదనపు బాక్స్ డ్రెయిన్లను నిర్మించనున్నట్లు వివరించారు. సరూర్ నగర్ చెరువు నుండి విడుదలయ్యే నీరు వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న రెండు డ్రెయిన్లు సరిపోవడంలేదని, సరూర్ నగర్ పరివాహక ప్రాంతాల నుండి వచ్చే వర్షపునీటి పరిమాణాన్ని, విడుదల చేసే నీటి మొత్తాన్ని పరిగణలో తీసుకొని ఇంజనీర్లు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి అదనంగా ఐదు బాక్స్ డ్రెయిన్లను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించాలని మేయర్ తెలిపారు. శాశ్వత పరిష్కారానికై చేపట్టే ఈ బాక్స్ డ్రెయిన్ల నిర్మాణాలకు మరో వారం రోజుల్లోగా టెండర్లను పిలువాలని అధికారులను ఆదేశించినట్లు విజయలక్ష్మి వెల్లడిరచారు. ఈ బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం, వాటి వైశాల్యం, నిర్మాణం జరిగే మార్గాలు, వీటి నిర్మాణానికి చేపట్టే ఇంజనీరింగ్, సాంకేతిక అంశాలను కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, కాలనీవాసులకు ఇంజనీర్లు వివరించారు. ఈ సందర్భంగా గడ్డిఅన్నారం వార్డులోని వివిధ కాలనీల ప్రతినిధుల సందేహాలకు ఇంజనీర్లు నివృత్తి చేశారు. అనంతరం నాగోల్ అయ్యప్ప కాలనీ, పరిసర కాలనీలు ముంపుకు గురికాకుండా చేపట్టనున్న పలు బాక్స్ డ్రెయిన్ పనులను గురించి మేయర్ విజయలక్ష్మి నాగోల్ కార్పొరేటర్ అరుణకు వివరించారు. ఈ సమావేశంలో ఎస్.ఎన్.డి.పి చీఫ్ ఇంజనీర్ వసంత, లేక్స్ విభాగం ఓ.ఎస్.డి. సురేష్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు.