విశాలాంధ్ర, హైదరాబాద్ : తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మహత్తర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని సీపీిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా సీపీిఐ నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 74 వార్షికోత్సవాల సందర్బంగా శుక్రవారం హైదరాబాద్, హిమాయత్ నగర్, సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద ఈ.టి.నరసింహ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో అయన మాట్లాడుతూ ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, నిరంకుశ నిజాం పాలనా అంతం కోసం తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని, ముస్లింలకు వ్యతరేకంగా కాదని అయన తెలిపారు. ప్రాణాలకు సైతం తెగించి వీరోచితంగా పోరాడి అమరులైన కమ్యూనిస్టుల వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్రను ఎవరూ తుడిచేయలేరని, బీజేపీకి ఏమి సంబంధం అని, బీజేపీ నుండి ఎవరన్నా తెలంగాణాలో స్వతంత్ర సమరయోధులు ఉన్నారా అని అయన ప్రశ్నించారు. కేవలం బీజేపీ రాష్ట్రంలో అధికారం కోసం నిస్సిగ్గు రాజకీయాలు చేస్తుందని అయన మండిపడ్డారు. రావి నారాయణ రెడ్డి, బద్దంఎల్లారెడ్డి, మఖ్డూమ్ మొహియుద్దీన్ లాంటి పోరాట యోధులు నిర్మించిన అపూర్వ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో నేటి తరం ఉద్యమాలు నిర్మించాలని ఈ.టి.నరసింహ పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర లేని ఆరెస్సెస్, బీజేపీ శ్రేణులు చరిత్రను వక్రీకరిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం లొంగి తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా విలీన దినోత్సవాలను నిర్వహించడంలేదని అయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విలీన దినోత్సవంగా ప్రకటించి, ఈ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేస్తూ స్పూర్తిని కలిగించే వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందని వి.ఎస్.బోస్ తెలిపారు. ఈ సభకు ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు బి. స్టాలిన్ అధ్యక్షత వహించగా సీనియర్ సీపీిఐ నాయకులూ ప్రేమ్ పావని, సీపీిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్. ఛాయాదేవి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు కమతం యాదగిరి, నిర్లేకంటి శ్రీకాంత్, మహిళా సమాఖ్య నేత పడాల నళిని, సిపిఐ నేతలు ఆర్. మల్లేష్, సిహెచ్. జంగయ్య,ఏఐఎస్ఎఫ్ నగర నేతలు గ్యార నరేష్, కంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.