గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి తలసాని
సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్లో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాను హుజురాబాద్ ఎలక్షన్ క్యాంపింగ్లో ఉన్నానని ఆస్పత్రిలో పేదల వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని, హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తానని చెప్పారు. గాంధీ దవాఖానలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రి నాలుగో అంతస్తులోని విద్యుత్ ప్యానెల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను గమనించిన హాస్పిటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అగ్ని ప్రమాదంతో దవాఖానలోని పలు వార్డుల్లోకి పొగ వ్యాపించింది. దీంతో రోగులు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా పలు వార్డుల్లోని రోగులను బయటికి పంపేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదం వల్ల దవాఖానలో కరెంటు తీగలు దగ్ధమయ్యాయని, త్వరలోనే వాటిని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.