మంత్రి వెల్లంపల్లి బహిరంగ క్షమాపణలు చెప్పాలి : అచ్చెన్నాయుడు
రామతీర్థంలో అశోక్ గజపతిరాజును అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. . బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ,ఆలయ సంస్కృతి, సంప్రదాయాలకు వైసీపీ తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. మంత్రి వెల్లంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.శంకుస్థాపనపై ధర్మకర్తల మండలితో చర్చించకపోవడం జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని అన్నారు. ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని, శంకుస్థాపన బోర్డుపై ఆలయ అనువంశిక ధర్మకర్త పేరు లేకపోవడం సంస్కృతి, సంప్రదాయాలను కాలరాయడమేనన్నారు. ప్రశ్నించిన అశోక్ గజపతిరాజును తోసివేయడం దుర్మార్గమన్నారు. ఏపీలో 200లకు పైగా ఆలయాలపై దాడులు జరిగాయని, ఏ ఘటనలోనూ దోషులను పట్టుకోలేదని అన్నారు.