మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ అసైన్డ్ భూములను కబ్జా చేసింది వాస్తవమే అని మెదక్ కలెక్టర్ హరీశ్ వెల్లడిరచారు. ఈటల భూముల అంశంపై మెదక్ కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ పరిధిలో అసైన్డ్ భూములను జమునా హ్యాచరీస్ కబ్జా చేసింది వాస్తవమేనని చెప్పారు. 70.33 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారుల సర్వేలో తేలిందన్నారు.అచ్చంపేట, హకీంపేట పరిధిలో గల సర్వే నంబర్ 77 నుంచి 82, 130, హకీంపేట్ శివారులో గల సర్వే నంబర్ 97, 111లో సీలింగ్ భూములను కబ్జా చేశారు. సర్వే నంబర్ 78, 81, 130లలో భారీ పౌల్ట్రీ షెడ్స్, ప్లాట్ఫామ్లు, రోడ్లను అనుమతి లేకుండా నిర్మించారు. సర్వే నంబర్ 81లో 5 ఎకరాలు, 130లో 3 ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తంగా 56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్లు తేలిందన్నారు. మొత్తానికి అసైన్డ్ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక పంపాం. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. అక్రమాలకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.