వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మరోసారి సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఅర్ ఇచ్చిన ప్రతి హామీ మోసమే.. ప్రతి పథకం బూటకమేనని అన్నారు. ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయని మోసగాడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. దేవరకద్ర మండలం వెంకటగిరిలో పత్తి రైతులను కలిసి కాసేపు ముచ్చటించారు. వారి కష్టాలు అడగి తెలుసుకున్నారు. వాళ్లతో కలిసి పత్తి తీసి.. ఉత్సాహం నింపారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చాక వ్యవసాయాన్ని పండుగ చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. వైఎస్సార్ పథకాల కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని స్పష్టం చేశారు. వైఎస్సార్ ప్రతి పథకాన్ని అమలు చేస్తానన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు పునర్వైభవం తీసుకొస్తానన్నారు. ప్రతి పేద మహిళ పేరు మీద పక్కా ఇల్లు కట్టిస్తానన్న షర్మిల.. మహిళల ఆర్థికాభివృద్ధే తన ధ్యేయమని పేర్కొన్నారు. కేసీఆర్ను రెండు సార్లు ముఖ్యమంత్రి చేసుకున్నా.. చేసింది మాత్రం శూన్యమని విమర్శించారు. రైతుబంధు 5 వేలు ఇచ్చి గొప్పలు చెప్తున్నాడని.. అదే వైఎస్సార్ వ్యవసాయానికి ఎకరాకు 30 వేల సబ్సిడీ పథకాలు ఇచ్చేవారని గుర్తుచేశారు. రుణమాఫీ చేయకుండా కేవలం రైతుబంధు ఇస్తే.. అది కాస్తా వడ్డీలకే సరిపోతుందని వివరించారు.