అద్భుతంగా పురోగతి సాధిస్తున్న గ్రామాలు, పట్టణాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన 19 మున్సిపాలిటీలకు రూ. 2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ నిధులను ప్రత్యేకంగా పారిశుధ్యం కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు- 2022 సాధించిన మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బడంగ్పేట్, కోరుట్ల, సిరిసిల్ల, తుర్కయాంజాల్, గజ్వేల్, వేములవాడ, ఘట్కేసర్, కొంపల్లి, హుస్నాబాద్, ఆదిభట్ల, కొత్తపల్లి, చండూర్, నేరేడుచర్ల, చిట్యాల, భూత్పూర్, అలంపూర్, పీర్జాదిగూడ, కోరుట్లకు నిధులు మంజూరు చేయనున్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన వారికి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలన్నారు. దేశంలోనే అత్యధికంగా అవార్డులు సాధించి రెండవ స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. ఈ అవార్డులు సాధించేందుకు కింది స్థాయిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలి నుంచి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి దాక అందరూ కలిసి ఒకే రకమైన ఆలోచన విధానంతో పనిచేయడం వల్లనే సాధ్యమైనది. జాతీయస్థాయిలో ఇంత గొప్ప గుర్తింపు లభించిందని ప్రశంసించారు.