విశాలాంధ్ర – సనత్ నగర్ : ఆషాడ బోనాల ఉత్సవాల సంద ర్భంగా మంత్రి తలసాని శ్రీని వాస్ యాదవ్ ఆదివారం తెల్లవారుజా మున కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనంతో తొలిబోనం, వడిబియ్యం సమర్పించారు. వారికి ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో పండితులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తలసాని దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. క్యూలైన్లలో వచ్చే భక్తులకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరారు. మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, కార్పొరేటర్ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.