ఏఐఎస్ఎఫ్`ఏఐవైఎఫ్ పిలుపు
విశాలాంధ్ర, హైదరాబాద్ : ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, సెప్టెంబర్ 7న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యార్థి, నిరుద్యోగులకు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. సయ్యద్ వలి ఉల్లా ఖాద్రీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.అశోక్ స్టాలిన్లు పిలుపునిచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చినా టీిఆర్ఎస్ పార్టీ మొదటి అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలో లక్షా ఏడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించినా ఇప్పటి వరకు అతీగతి లేదని వారు దుయ్యబట్టారు. ఆదివారం హైదరాబాద్, హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ప్రభుత్వం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేసే విధంగా పూటకొక మాట మాట్లాడుతున్నారన్నారు. 2020 డిసెంబర్లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్పీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారికంగా స్పష్టమైంది. ఆ నివేదిక ఉండగానే కొత్త లెక్కలు పూటకో విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 50 వేల కొత్త కొలువుల ఉద్యోగాల భర్తీ ఏమో కానీ ఈ మూడున్నర ఏళ్లలో 52 వేల మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డున పడేసింది. ఆయా శాఖల్లో ఏడు సంవత్సరాల నుండి పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం క్రమేణా తొలగిస్తుంది. 2018 నుంచి ఇప్పటి వరకు మొత్తం 52 ,515 మంది ఉద్యోగులను ప్రభుత్వం ఇంటికి పంపించింది. ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి ఏడు నెలలైనా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీనిని ప్రచారం చేసిన ఇప్పటికీ నోటిఫికేషన్లకు అతి గతి లేదు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై స్పష్టత వచ్చిన, జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదముద్ర వేసిన రాష్ట్ర సర్కార్ కొలువుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసేది లేదు. ఇదిగో ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఉద్యోగాల భర్తీ లేదు. హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలను ఎత్తివేసే ప్రయత్నాలను రాష్ట్రప్రభుత్వం విరమించుకోవాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయకుండా పాఠశాలల్లో పిల్లలు లేరనే సాకుతో ఏడు వేల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ప్రభుత్వ విద్య పరిరక్షణ, ఉద్యోగాల నోటిఫికేషన్, జాబ్ క్యాలెండరు వెంటనే విడుదల చేయాలని. డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విద్యార్థి నిరుద్యోగుల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.