తెలంగాణలో ఎనిమిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం సాగుతోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. గత ఎనిమిదేళ్లుగా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కుంభకోణం యథేచ్చగా సాగుతోందని ఆయన ఆరోపించారు. వానాకాలం పంటలో నిజామాబాద్ జిల్లాలోనే లక్ష క్వింటాళ్లు పందికొక్కుల్లా బొక్కారంటే… రాష్ట్రం మొత్తం మీద కుంభకోణం ఏ స్థాయిలో ఉంటుందోనని ఆయన అన్నారు. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియకుండానే ఇది సాధ్యమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ స్కామ్ పై సీబీఐ విచారణకు ఆదేశించకుండా ఆపుతున్నది ఎవరని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటు ఓ వార్తా పత్రికలో వచ్చిన ‘నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ స్కామ్.. లెవీ బియ్యాన్ని బహింరంగ మార్కెట్లో అమ్ముకున్న మిల్లర్లు’ అనే కథనాన్ని షేర్ చేశారు.