పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని వినతి
ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇచ్చినా పనిచేస్తానంటూ ప్రస్తావన
తెలంగాణ కాంగ్రెస్లో పదవుల చిచ్చు ఇంకా రేగుతూనే ఉంది. పదవుల కోసం నేతల మధ్య పోటీ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. టీపీసీసీ పదవుల కూర్పు టీ కాంగ్రెస్లో సంక్షోభానికి దారి తీయగా.. కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ను దూతగా తెలంగాణకు ఏఐసీసీ పంపించింది. ఆయన రంగంలోకి దిగి సీనియర్ నేతలతో భేటీ కావడంతో సంక్షోభానికి కాస్త తెర పడినట్లు అయింది. టీపీసీసీ పదవుల్లో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తన పార్టీ పదవులకు ఇటీవల రాజీనామా చేయడం పార్టీలో కలకలం రేపింది. ఆమెతో పాటు మరికొంతమంది కూడా పార్టీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. తన సీనియారిటీకి తగిన పదవి ఇవ్వలేదని ఆమె తీవ్ర అసంతృప్తి వెళ్ళగక్కుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్కు కొండా సురేఖ లేఖ రాశారు. తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఏఐసీసీ కార్యదర్శి పదవి ఇవ్వాలని కోరారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపిక చేసిందుకు కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు.తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఏఐసీసీ సెక్రటరీ పదవి వచ్చేలా చూడాలని ఇప్పటికే తాను రేవంత్ రెడ్డికి లేఖ రాసిన విసయాన్ని కొండా సురేఖ గుర్తు చేశారు. రాజకీయాల్లో తనకు మూడు దశాబ్ధాల అనుభవం ఉందని, తాను వర్కింగ్ ప్రెసిడెంట్, ఏఐసీసీ సెక్రటరీ పదవులకు అర్హురాలిని అని కొండా సురేఖ తన లేఖలో పేర్కొన్నారు. మహిళ సాధికారిత సాధించేందుకు తనకు అన్ని నైపుణ్యాలు ఉన్నాయని, ఆ రెండు పదవుల్లో ఏది ఇచ్చినా తాను న్యాయం చేస్తానంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని కార్యకర్తలంతా కాంగ్రెస్ పనితీరు పట్ల సంతోషంగా ఉండేలా చూస్తానంటూ లేఖలో పేర్కొన్నారు