నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో 8 నామినేషన్లు ఆమోదం పొందగా మూడు తిరస్కరణకు గురయ్యాయి. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నామినేషన్లను పరిశీలించారు.ఈ సందర్భంగా నల్లగొండ స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం ఒక స్థానం ఎన్నికకు గాను మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 8 నామినేషన్లు ఆమోదించగా.. తక్కిన ముగ్గురి నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు తెలిపారు.