నిమ్స్లో ఏర్పాటు చేసిన ఎండోస్కోపిక్ పరికరం, ఎంఆర్యూ ల్యాబ్, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఫిజియోథెరపీ విభాగం, బోన్ డెన్సిటోమీటర్, శాంపిల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం, వాటర్ ఏటీఎంలను హరీశ్రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల హెచ్వోడీలతో మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు.అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ, రూ. 12 కోట్లతో వివిధ మెడికల్ పరికరాలను రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. జన్యుపర వ్యాధుల విశ్లేషణ, గుర్తింపునకు కొత్త ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిమ్స్లో రూ. 2.73 కోట్లతో న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రూ. 40 లక్షలతో అత్యాధునిక న్యూరో ఎండోస్కోపి ఏర్పాటు చేశారు. నిమ్స్లో అదనంగా 200 ఐసీయూ పడకలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతానికి 155 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. కొత్త బెడ్లు జనవరి 15 నాటికి అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. నిమ్స్లో ప్రస్తుతం 89 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, మరో 120 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిమ్స్లో పరికరాల కోసం రూ. 154 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో నమోదు కాలేదని స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.