3 వేల పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలికలు హవాకొనసాగింది. 92.45 శాతం ఉత్తీర్ణతతో తమ సత్తా చాటుకున్నారు. పరీక్షలకు హాజరైన వారిలో బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు విద్యార్థుల్లోనూ బాలికలదేలే పై చేయి సాధించారు. బాలికలు 58.76 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 46.21 శాతం మంది పాసయ్యారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని 3,007 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 15 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాకపోవడంతో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది. 5,03,579 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవగా, 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రయివేటుగా పరీక్షలకు హాజరైన వారు 819 మంది కాగా వారిలో 51.89 శాతంతో 425 మంది పాసయ్యారు.
గురుకులాల్లో 99.32 శాతం ఉత్తీర్ణత
పది ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకన్నా మంచి ఫలితాలు సాధించారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ గురుకుల విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించి మొదటి వరుసలో నిలిచారు.
గురువారం విడుదలైన పది ఫలితాల్లో అత్యధికంగా 99.32 శాతం ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించారు.