మంత్రి కేటీఆర్
ఇండస్ట్రీ పాలసీని సరైన రీతిలో అమలు చేయకుండా.. రాజకీయాలు చేస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. హైదరాబాద్లోని బేగంపేట కాకతీయలో నిర్వహించిన సీఐఐ తెలంగాణ వార్షిక సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడారు. పరిశ్రమల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పులు అవసరమని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాలని సూచించారు. స్వతంత్ర భారత్లో విజయవంతమైన స్టార్టప్.. తెలంగాణే మాత్రమే అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందన్న ఆయన మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఎందుకని ఉద్యమ వేళ చాలా మంది అడిగారని చెప్పారు. అందరికీ ఒకటే సమాధానం.. ఇప్పుడున్న తెలంగాణ అని కేటీఆర్ వివరించారు.బీజేపీ పాలిత రాష్ట్రాలకే పరిశ్రమలు వచ్చేలా.. ఒత్తిడి చేయడం కరెక్టు కాదన్నారు. భారత్లోని ఇతర రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలని తామూ కోరుకుంటున్నామనీ.. అయితే, దానికి ఇది సరైన విధానం కాదన్నారు.