వేసవిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా నూటికి నూరు శాతం సురక్షిత మంచి నీటిని అందించాలని..సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను అదేశించారు. శుక్రవారం వేసవిలో మంచి నీటి సమస్యల మీద ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సంబంధిత అధికారులు, సర్పంచులతో హైదరాబాద్ మిషన్ భగీరథ కార్యాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. నీటి ఎద్దడిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ, సమన్వయం చేస్తూ, తగిన విధంగా అధికారులు పని చేయాలని సూచించారు. పంపుల నిర్వహణ, లీకేజీలు లేకుండా చూసుకోవడం, ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్, సమస్యలు ఉత్పన్నం అయితే ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.