ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్ కార్యా లయంలో ఇటీవలే సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రీజియన్ పరిధిలోని పలు డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడపాల్సిన రూట్లు, సాధ్యాసాధ్యాల గురించి చర్చించారు. బస్ డిపోల్లో ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్లో 132 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో పలు బస్ డిపోల వద్ద ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. బస్సులను అత్యాధునిక సౌకర్యాలతో తీసుకువస్తున్నట్లు రీజినల్ మేనేజర్ కే శ్రీలత పేర్కొన్నారు. 41 సీట్లతో బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉంది. ప్రయాణికుల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బస్సులో కనీసం మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సీసీటీవీ కెమెరాలు టీఎస్ ఆర్టీసీ కంట్రోల్ రూమ్కు కనెక్ట్ చేయబడుతాయని తెలిపారు.