దేశంలోని వివిధ రకాల సాహిత్యాన్ని ఏటా ఒక్కచోటకు తెచ్చే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన మరోసారి పుస్తక ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. కోవిడ్ దృష్ట్యా సందర్శకుల ఆదరణ పెద్దగా ఉండదన్న ఉద్దేశంతో నిర్వాహకులు గతేడాది 260 స్టాళ్లనే ఏర్పాటు చేసినప్పటికీ పుస్తక ప్రియులు భారీగా తరలిరావడంతో ప్రదర్శన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఈసారి 320 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తెలిపారు.
నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతోపాటు తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ ఇంగ్లిష్ పుస్తకాలు చదివే ప్రజలు మొదటి నుంచీ ఇక్కడ ఉన్నారు. పాఠకుల అభిరుచికి తగిన విధంగానే పుస్తక ప్రచురణ సంస్థలు ఆవిర్భవించాయి. కోఠిలోని బడీచౌడీ పుస్తక బజార్గా వెలుగొందింది. అక్కడి పుస్తక విక్రేతలే హైదరాబాద్ బుక్ ఫెయిర్కు శ్రీకారం చుట్టారు.