శుక్రవారం కరీంనగర్ పట్టణంలోని వావిలాలపల్లె లో ఫ్రైడే పురస్కరించుకుని డ్రై డేను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. మంత్రి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. ఇంటి ముందు నీటి తొట్లలో ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ బాధ్యత అన్నారు. విషజ్వరాల పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. విష జ్వరాలు ప్రబలిన తరువాత కాకుండా జ్వరాలు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలందరూ ప్రతి శుక్ర, ఆదివారాలను డ్రై డేలుగా పాటించాలని, ప్రజల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రజలు తమ ఇంటి ముందు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ద్వారాలను అరికట్టవచ్చు అన్నారు. డ్రై డే ను విజయవంతం చేసేందుకు 5గురు సభ్యులతో గల 100 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మందుల కొరత లేదని,ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు,తదితరులు పాల్గొన్నారు.