న్యూదిల్లీ: సాయుధ బలగాల్లో నియామకాలకు సంబంధించి మోదీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చేవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభమవుతుందని, ఈ పిటిషన్లు సరైన ధర్మాసనం ముందుకు వచ్చేలా లిస్టింగ్లో పెడతామని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎంకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. భారత వైమానిక దళ ఆశావాదుల శిక్షణ జరుగుతోందని, వారంతా నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారని ఓ పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్తో వారి ఉద్యోగ జీవితం 20 ఏళ్ల నుంచి నాలుగేళ్లకు కుదించారని తెలిపారు. ఇది అత్యవసర వ్యవహారమని, దయచేసి దీనిని లిస్టింగ్ చేయాలని ధర్మాసనానికి విన్నవించారు. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ మరో న్యాయవాది ఎంఎల్ శర్మ ప్రజాప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 70వేల మంది ఉద్యోగ నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారని, తక్షణమే వారికి ఉద్యోగ అవకాశం కల్పించేలా ఆదేశించాలని శర్మ చెప్పారు.