కలెక్టర్ సూర్యకుమారి
విశాలాంధ్ర -విజయనగరం : అంగన్వాడీ కేంద్రాల్లో అనధికారిక తనిఖీలను ప్రోత్సహించవద్దని, అధికారిక కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించవద్దని ఐసీడీఎస్ సీడీపీవోలను, ఎంఈవోలను జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశించారు. జిల్లాలో ఇటీవల కొన్ని చోట్ల జరిగిన అనధికారిక తనిఖీలపై ఆమె స్పందిస్తూ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తనిఖీలు నిర్వహించే క్రమంలో తప్పనిసరిగా సంబంధిత శాఖ నుంచి లేదా జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అనధికారిక వ్యక్తులు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయటం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు జిల్లా శిశు సంక్షేమ అధికారికి సమాచారం అందించి పూర్వాపరాలు తెలుసుకోవాలని, ఆ తర్వాతే వారికి స్పందించాలని సూచించారు. ఇటీవల కొంతమంది అనధికారిక వ్యక్తులు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన విషయం తన దృష్టికి రావటంపై స్పందించిన కలెక్టర్ సూర్యకుమారి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా సీడీపీవోలకు, ఎంఈవోలకు సర్క్యులర్లు జారీ చేశారు.