గుంకలాం లేఅవుట్ను సందర్శించిన కలెక్టర్ సూర్యకుమారి
లబ్ధిదారులకు మరింత తోడ్పాటు అందించాలని అధికారులకు సూచన
విశాలాంధ్ర – విజయనగరం: సామూహిక గృహ ప్రవేశాల చేసేందుకు అనుగుణంగా ఉగాది నాటికి అన్ని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశించారు. లబ్ధిదారులకు తోడ్పాటు అందించాలని నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, ఆకాంక్షల మేరకు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని పేర్కొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గుంకలాంలో చేపట్టిన అతి పెద్ద లేఅవుట్ను శనివారం ఆమె సందర్శించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. లేఅవుట్లో కలియ తిరిగి జరుగుతూ పనులను స్వయంగా చూశారు. ఈ క్రమంలో లబ్ధిదారులతో మాట్లాడారు. వేగంగా జరుగుతున్న నిర్మాణాలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మరింత ముమ్మరంగా సాగించేందుకు అందరూ ఉత్సాహంగా పని చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
లేఅవుట్ సందర్శనలో భాగంగా ముందుగా ఆమె ఇంటి నిర్మాన సామాగ్రి నాణ్యతా పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. దాని ద్వారా అందించే సేవల గురించి అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇనుము, రాయి, ఇసుక ఇతర సామాగ్రి నాణ్యతను ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షించాలని సూచించారు. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పనులపై గృహ నిర్మాణ శాఖ పీడీ, డీఈ, స్థానిక మున్సిపల్ కమిషనర్, విద్యుత్ సిబ్బంది, స్థానిక తహశీల్దార్, సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ఆమె పలు సూచనలు చేశారు. సామూహిక గృహ ప్రవేశాల నాటికి అనుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. అందరూ సమన్వయంతో ముందుకెళ్లి ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలను శతశాతం పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులు సంతృప్తి చెందే విధంగా అన్ని రకాల సేవలు అందించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించాలని అధికారులకు, సిబ్బందికి చెప్పారు. సామూహిక గృహ ప్రవేశాలను అట్టహాసంగా నిర్వహించేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలకు సంబంధించి జరిగిన చెల్లింపుల గురించి సంబంధిత అధికారులను ఆరా తీశారు.
ఆమె వెంట గృహ నిర్మాణ శాఖ పీడీ రమణ మూర్తి, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు నాయుడు, తహశీల్దార్ బంగార్రాజు, విద్యుత్ శాఖ అధికారులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు ఉన్నారు.